"పేతురు రాసిన రెండవ పత్రిక"
పరిచయం
రచయిత
శుభాకాంక్షల భాగంలో (1:1) పేర్కొన్నట్లుగా, అపొస్తలుడైన పేతురే దీని రచయిత. తన మరణం గురించి ప్రభువు నుండి తనకు ప్రత్యేకమైన బయలుపరచడం కలిగిందని (1:14; యోహాను 21:18-19 చూడండి), అలాగే పర్వతం మీద ప్రభువు రూపాంతరము చెందినప్పుడు తాను అక్కడ ఉన్నానని (1:16-18; మత్తయి 17:1-9 చూడండి) రచయిత పేర్కొన్నారు. ఆయన తన మొదటి పత్రికను కూడా ప్రస్తావించారు (3:1) మరియు అపొస్తలుడైన పౌలుతో తనకు పరిచయం ఉందని అంగీకరించారు (3:15). కాబట్టి, దీనిని పేతురే రాసి ఉండాలి, లేకపోతే ఇది ఒక స్పష్టమైన నకిలీ రచన అయి ఉండాలి.
గ్రహితలు
ఈ పత్రిక, "మన దేవునియొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతినిబట్టి, మావలెనే అమూల్యమైన విశ్వాసము పొందినవారికి " ఉద్దేశించి వ్రాయబడింది (1:1).
ఇది వారికి తాను వ్రాసిన రెండవ పత్రిక అని రచయిత పేర్కొన్నారు (3:1). ఒకవేళ ఇది 'మొదటి పేతురు' పత్రికను అందుకున్న వారికే వ్రాయబడిన రెండవ పత్రిక అయితే, దీనిని స్వీకరించినవారు ప్రస్తుత టర్కీ దేశంలోని ప్రాంతాలైన పొంతు, గలతీయ, కప్పదొకియ, ఆసియ మరియు బిథునియాలలో నివసిస్తున్న క్రైస్తవ "పరదేశులు" (1 పేతురు 1:1; 2:11 చూడండి) అయి ఉంటారు.
రచన జరిగిన కాలము మరియు ప్రదేశం
పేతురు తన మరణం సమీపించిందని ప్రస్తావించాడు (1:14). నీరో పరిపాలనా కాలంలో పేతురు మరణించాడనేది సాధారణంగా అంగీకరించబడిన విషయం. క్రీ.శ. 68లో నీరో ఆత్మహత్య చేసుకున్నాడు కాబట్టి, ఈ పత్రిక అంతకు ముందే రాయబడి ఉండాలి. అందువల్ల, ఈ పత్రిక బహుశా క్రీ.శ. 67లో ఎప్పుడో ఒకప్పుడు రాయబడి ఉండవచ్చు.
ఇది ఎక్కడ రాయబడిందనే దానిపై స్పష్టత లేదు; అయితే, తన మరణానికి కొద్దికాలం ముందు చెరసాలలో ఉన్నప్పుడు దీనిని రాసి ఉంటే, అది రోమ్ నుండే రాయబడి ఉండేది.
ఈ పత్రిక యొక్క ఉద్దేశ్యం
ఈ పత్రికను రాయడంలో పేతురు తన ఉద్దేశ్యాన్ని చాలా స్పష్టంగా తెలియజేశాడు:
"జ్ఞాపకం చేయడం ద్వారా తన సహోదరులను ఉత్తేజపరచడం" (1:12-15; 3:1)
తన మరణం సమీపించిందని తెలిసి (1:13-14), తన పాఠకులు సత్యంలో స్థిరంగా ఉండేలా (1:12) మరియు ప్రవక్తలు పలికిన మాటలను, అపొస్తలులు ఇచ్చిన ఆజ్ఞలను—ముఖ్యంగా ప్రభువు తిరిగి వస్తారనే వాగ్దానానికి సంబంధించి—గుర్తుంచుకునేలా చూడాలని పేతురు కోరుకున్నాడు (3:1-4).
పత్రిక యొక్క సారాంశం
2వ పేతురు పత్రిక యొక్క సారాంశాన్ని దాని చివరి రెండు వచనాల (3:17-18) నుండి గ్రహించవచ్చు, మరియు అది ఈ విధంగా చెప్పబడింది:
"జాగ్రత్తగా ఉండండి, కానీ అభి వృద్ధిపొందుడి "
క్రైస్తవులు తప్పులచేత మోసగించబడి, తమ స్థిరత్వం నుండి పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలని ఆయన హెచ్చరిస్తున్నాడు. అదే సమయంలో, యేసు క్రీస్తు కృపలోను, ఆయన గురించిన జ్ఞానంలోను ఎదగమని వారిని ప్రోత్సహిస్తున్నాడు. ప్రారంభ వందనాల తర్వాత, ఈ పత్రికలోని దాదాపు ప్రతి వచనం ఎదగడానికి ప్రోత్సాహకరంగాను లేదా అబద్ధ బోధకులకు (ప్రభువు తిరిగి వస్తాడనే ఆలోచనను ఎగతాళి చేసేవారితో సహా) వ్యతిరేకంగా హెచ్చరికగాను ఉంది.
ముఖ్య వచనాలు: 2 పేతురు 3:17-18
17 ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలిసికొనియున్నారు గనుక మీరు నీతివిరోధుల తప్పుబోధవలన తొలగింపబడి, మీకు కలిగిన స్థిరమనస్సును విడిచి పడిపోకుండ కాచు కొనియుండుడి. 18 మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభి వృద్ధిపొందుడి. ఆయనకు ఇప్పుడును యుగాంతదినము వరకును మహిమ కలుగును గాక. ఆమేన్.
గ్రంధ విభజన
పరిచయం\ఉపొధ్ఘాతము (1:1-2)
కృపలోనూ జ్ఞానంలోనూ ఎదగండి (1:3-21)
అబద్ధ బోధకుల పట్ల జాగ్రత్త (2:1-22)
ప్రభువు రాకడ కోసం ఎదురుచూడండి (3:1-18)